కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జడ్చర్ల : జడ్చర్లవాసులకు సంకటంగా మారిన సిగ్నల్ గడ్డ రోడ్డు సమస్యను నెల రోజుల్లో పరిష్కరిస్తామని నేషనల్ హైవే ఉన్నతాధికారులు హామీ ఇచ్చారని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి వెల్లడించారు. ఈ విషయం గురించి తాను హైవే అథారిటీ అధికారులతో ప్రత్యేకంగా కలిసి సిగ్నల్ గడ్డ రోడ్డు గురించి ఫిర్యాదు చేసానని చెప్పారు. జాతీయ రహదారి నెంబర్ 167 నిర్మాణ పనుల్లో భాగంగా జడ్చర్ల పట్టణంలోని సిగ్నల్ గడ్డ ప్రాంతంలో వంతెనతో పాటుగా రోడ్డును నిర్మిస్తున్నారు. అయితే ఈ నిర్మాణ పనులను చేపట్టిన కాంట్రాక్టర్ ఉదాసీనత, రైల్వే శాఖ నుంచి కొన్ని క్లియరెన్స్ లు రావాల్సి ఉండటం లాంటి వివిధ కారణాలతో ఈ రోడ్డు నిర్మాణం సంవత్సరాల తరబడిగా కొనసాగుతోంది. పనులను కొంత కాలం చేసిన గుత్తేదారు వివిధ కారణాలను చూపుతూ నిర్మాణ పనులను చాలా కాలంగా నిలిపివేయడంతో ఏళ్ల తరబడిగా అసంపూర్తిగా ఉన్న రోడ్డు నిర్మాణపనుల్లో భారీ గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు ఆటంకం కలుగడంతో పాటుగా ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. ప్రత్యేకించి వర్షాల కారణంగా ఈ రోడ్డు గుంతల్లో బురద పేరుకుపోవడంతో ఆ ప్రాంతంలో ప్రజలు తిరగడానికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో ఉన్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి ఈ విషయం గురించి ప్రజలు ఫిర్యాదులు చేసినా ఆయన పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అనిరుధ్ రెడ్డి సోమవారం నేషనల్ హైవే అథారిటీ అధికారులకు ఈ రోడ్డు గురించి ఫిర్యాదు చేసారు. నేషనల్ హైవే అథారిటీ రీజనల్ హెడ్ కృష్ణ ప్రసాద్ కు జడ్చర్ల సిగ్నల్ గడ్డ రోడ్డు దుస్థితిని, ఈ విషయంలో కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యాన్ని గురించి ఫిర్యాదు చేసారు. ప్రస్తుతం సిగ్నల్ గడ్డ రోడ్డు దుస్థితికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను కూడా ఆయనకు చూపించారు. ఈ విషయంగా స్పందించిన ఆర్ఓ కృష్ణ ప్రసాద్ దీనిపై వెంటనే చర్యలు తీసుకుంటామని, 30 రోజుల్లోపుగా సిగ్నల్ గడ్డలో బీటీ రోడ్డు వేయించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని అనిరుధ్ రెడ్డి మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో వివరించారు. హైవే అధికారులు హామీ ఇచ్చిన విధంగానే నెల రోజుల్లో సిగ్నల్ గడ్డ రోడ్డు సమస్య పరిష్కారమౌతుందని ఆశాభావం వ్యక్తం చేసారు. అధికారులు చెప్పిన గడువు లోపుగా సమస్య పరిష్కారం కాకపోతే ఈ విషయాన్ని తాను మరింత సీరియస్ గా తీసుకొని సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
Admin
Kalam Power News