కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : మహబూబ్నగర్, ఏప్రిల్ 26 ( కలం పవర్ న్యూస్ బ్యూరో ) మహబూబ్నగర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం క్రౌన్ గార్డెన్లో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులు మరియు రాజకీయ నాయకులు వేరు కాదని, ఇద్దరూ సమాజ సేవకులేనని పేర్కొన్నారు. జర్నలిస్టులను తన కుటుంబ సభ్యులుగా భావిస్తున్నానని తెలిపారు. తాను చేస్తున్న సహాయ కార్యక్రమాలను వక్రీకరించి చూడొద్దని విజ్ఞప్తి చేసిన ఆయన, మంచి పనులను ప్రజలకు చేరవేయడం జర్నలిస్టుల బాధ్యత అని స్పష్టం చేశారు. అదే సమయంలో తప్పులు జరిగితే వాటిని సరిదిద్దే బాధ్యత కూడా మీడియాదేనని అన్నారు. “మీ కలానికి ముగింపు లేదు… రాజకీయాలు శాశ్వతం కాదు” అంటూ సమాజంలో మీడియా ప్రాముఖ్యతను ఆయన గుర్తుచేశారు. పాలమూర్ ప్రాంత ప్రశాంతత కోసం అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే, తాను ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. గర్భిణీల కోసం ప్రారంభించిన యెన్నం హెల్త్ కిట్ల పథకం కింద ఇప్పటివరకు 850 కిట్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. యెన్నం హెల్త్ కార్డు ద్వారా అవసరమైతే ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఉచిత వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. ప్రెస్ క్లబ్కు ప్రింటర్, కంప్యూటర్ అందించేందుకు హామీ ఇచ్చిన ఆయన, బాధ్యతలను విస్మరిస్తే సమాజానికి నష్టం కలుగుతుందని హెచ్చరించారు. జర్నలిస్టులు సమాజ శ్రేయస్సు కోసం కృషి చేస్తారని, విలువలను కాపాడాల్సిన అవసరం ఉందని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తు మెరుగుపరిచేందుకు 20 వేల మందికి మార్పు తీసుకురావడం లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఏటీసీ సెంటర్లో నూతన సదుపాయాలు కల్పిస్తున్నామని, మహబూబ్నగర్ను అన్ని రంగాల్లో ముందంజలో నిలపడం తన లక్ష్యమని చెప్పారు. నాయకులు సరైన మార్గంలో నడవడానికి ప్రజలు, జర్నలిస్టులు ఇచ్చే సూచనలు, సలహాలు ఎంతో కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు
Admin
Kalam Power News